టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తున్నాయనే వార్తలపై స్పందించలేను: సోము వీర్రాజు

  • బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి పవన్ ను పిలుస్తాం
  • బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుంది
  • విమర్శలు చేసే సమయంలో గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలి
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేయబోతోంది. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. రేపట్లోగా అభ్యర్థి ఎవరనే విషయం తేలబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి పవన్ ను కూడా పిలుస్తామని అన్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ, విమర్శలు చేసే సమయంలో గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, కులాలను రాజకీయాల్లోకి లాగడం వంటివి చేయవద్దని హితవు పలికారు. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ దగ్గరవుతున్నాయనే ప్రచారం జరుగుతోందంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా... దానిపై తాను స్పందించలేనని చెప్పారు.

Somu Veerraju
BJP
Pawan Kalyan
Janasena
YSRCP
Badvel Election

More Telugu News